ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రమాదం తప్పింది. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ను ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలిసింది. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా ఈ సంఘటన జరిగింది.
హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అక్కడి నుంచి వెంటనే ఆదిత్యనాథ్ స్థానిక సర్క్యూట్ హౌస్కు చేరుకున్నారు. అనంతరం సీఎం యోగి, సిబ్బందిని వేరే హెలికాప్టర్లో లక్నోకు తరలించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్రాజ్ శర్మ చెప్పారు.